‘భారత్‌ను ట్రంప్‌ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న!

  • భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న
  • ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టమని రూబియో వివరణ
  • ఆన్‌లైన్ జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా మంత్రి సీరియస్
  • భారతీయుల సహకారంపై రూబియో ప్రశంసలు
  • నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో
ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అమెరికన్ జర్నలిస్ట్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో.. భారతీయులపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న జాత్యహంకార దాడుల గురించి సదరు పాత్రికేయుడు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే గతంలో భారత్‌ ఓ ‘నరకం’ అంటూ ట్రంప్ చేసిన పోస్ట్‌ను జర్నలిస్ట్ ప్రస్తావించగా రూబియో దానికి చాకచక్యంగా సమాధానమిచ్చారు.

ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టం
‘‘ట్రంప్ అలా అనలేదు. ఆయనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టం. నిన్న రాత్రి జరిగిన ఓ ఈవెంట్‌లోనూ ప్రధాని మోదీపై, భారత్‌పై ఆయన తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ట్రంప్‌కు ఇష్టం లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. ఆయనకు అత్యంత ఆప్తుడైన సెర్గియో గోర్‌ను భారత్‌కు రాయబారిగా పంపించేవారు కాదు’’ అని వివరించారు.

సోషల్ మీడియాలో మూర్ఖులు
ఆన్‌లైన్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార వ్యాఖ్యల గురించి రూబియో సీరియస్‌గా స్పందించారు. ‘‘ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు. అలాంటి వారు అమెరికాలోనూ ఉన్నారు. ఇక్కడా ఉండొచ్చు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడిన భారతీయులు మా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. వారి సహకారాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం’’ అని రూబియో కొనియాడారు.

అసలు ఆ వివాదం ఏంటి?
గత ఏప్రిల్‌లో ఓ పాడ్‌కాస్టర్ భారత్‌ను తక్కువ చేస్తూ పెట్టిన వివాదాస్పద పోస్ట్‌ను ట్రంప్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ గట్టిగానే స్పందించింది. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ‘‘ఈ తరహా వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య పరస్పర గౌరవానికి, ద్వైపాక్షిక సంబంధాల వాస్తవికతకు అద్దం పట్టవు’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

Marco Rubio
India
Donald Trump
S Jaishankar
US Foreign Policy
Racism
Social Media
India US relations
Randhir Jaiswal
America

More Telugu News